విద్యుత్తు బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి

ప్రధాని మోడికి సిఎం కెసిఆర్‌ లేఖ

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: విద్యుత్‌ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణల బిల్లులో ప్రజా ప్రయోజనాలు కానీ, విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రయోజనాలు కానీ లేవు. అయితే ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి అని సిఎం కెసిఆర్‌ ప్రధాని మోడిని కోరారు. రాష్ర్టాల అధికారాలను హరించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు2020పై రాష్ర్టాల అభిప్రాయాలు తెలుపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాశారు. ప్రభుత్వం తరఫున తమ ఆందోళనను, బిల్లు వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ.. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తేల్చిచెప్పారు.

కెసిఆర్ ‌ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. బిల్లులో పేర్కొన్నట్టుగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిని కేంద్రం నియమించే సెలెక్షన్‌ కమిటీ ఎంపికచేయడం సరైనది కాదు. ఈ రకమైన చర్య రాష్ర్టాలకు విద్యుత్‌ రంగంలో ఉన్న అధికారాలను హరించడమే అవుతుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం.. అందులోనూ రాష్ర్టాల యంత్రాంగం పనితీరును నేరుగా ప్రభావితంచేసే విద్యుత్‌ లాంటి అంశంపై కేంద్రం పార్లమెంట్‌ చట్టం తీసుకురావడం సమంజసంకాదు. ఇది రా జ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమే అవుతుంది. ఈ వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాం. నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీలాంటి పాలసీని రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన ఆమోదంతో తీసుకొనిరావాలి. తూతూ మంత్రంగా సంప్రదించడం సరైనది కాదు. దేశంలోని ప్రతి రాష్ర్టానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని రాష్ర్టాల్లో జల విద్యుత్‌కు అవకాశం ఉన్నది. మరి కొన్నింటిలో పవన విద్యుత్‌.. ఇంకొన్నింటిలో సౌరవిద్యుత్‌తోపాటు భూమి అందుబాటులో ఉన్నాయి. రాష్ర్టాలు తమకు ఉన్న వనరులు, అవసరాల నేపథ్యంలో పాలసీని రూపొందించాలి. ఇలాంటి విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా.. విధానాల రూపకల్పనలో రాష్ర్టాలకు స్వేచ్ఛ ఉండాలి.నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్డీసీ) దేశవ్యాప్తంగా విద్యుత్‌ షెడ్యూలింగ్‌ చేసే శక్తిమంతమైన సంస్థగా బిల్లులో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/