ఇది తేనే పూసిన కత్తి లాంటి చట్టం

కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఎంపీలకు దిశానిర్దేశం

cm kcr

హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసేలా ఉందని సిఎం కెసిఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లును రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలంటూ ఎంపీ కె.కేశవరావును సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ బిల్లులో చెబుతున్నారని, నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమయ్యే పనేనా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు.

ఇది తేనె పూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని కచ్చితంగా వ్యతిరేకించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉందని, దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 75 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని, భారీగా సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం కోసం చేసిందని సిఎం కెసిఆర్ నిలదీశారు. ‘దేశం ఆర్థిక సంక్షోభంలో నిలిచిన సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? మనదేశంలో పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. ఇప్పుడు సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏంటి? కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా ఉంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. రాజ్యసభలో దీన్ని గట్టిగా వ్యతిరేకించి, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయండి’ అంటూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/