నిర్మల్‌ జిల్లా భైంసాలో ఉద్రిక్తత

ఇరువర్గాలు పరస్పరం దాడులు.. 144 సెక్షన్‌ అమలు

clash between two communities
clash between two communities

నిర్మల్‌: జిల్లాలోని భైంసా పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ 144 సెక్షన్‌ అమలులో ఉంది. ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. భైంసా లోని కోర్వ గల్లిలొ తమ వర్గం వారిపై దాడి చేస్తున్నారని పుకార్లతొ మరో వర్గం ప్రజలు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల ప్రజలు పరస్పరం రాళ్ళతొ దాడి చేసుకున్నారు. రాత్రి 9.30 ప్రాంతంలో చోటు చేసుకున్న ఘర్షణ దాదాపు అర్థరాత్రి 2గంటల వరకు కొనసాగింది. ఈ గొడవల్లో వీధుల్లో పార్క్ చేసిన వాహనాలు 23 బైకులు, 2 ఆటోలు, ఓ కారుకు నిప్పంటించారు. సుమారు 16 ఇల్లు కూడా ధ్వంసం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మంటల్లొ గ్యాస్ సిలెండర్లను పడేయడంతొ అవి ఒక్కసారిగా పేలాయి. దీంతొ అక్కడున్న ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. అడ్డొచ్చిన పోలీసుల్నిసైతం వదల్లేదు. దీంతో ఈ గొడవల్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, భైంసా డీఎస్పి నర్సింగ్ రావు, పట్టణ సీఐ శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. వీరితోపాటు చాలా మంది సామాన్యులు కూడా గాయాలపాలయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి భైంసా పట్టణానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐజి నాగిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, 4 ఎస్పీలు చేరుకుని సంఘటన స్థలానికి పరిశీలించారు. భైంసాలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/