తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ముట్టడించిన ఏబివిపి.. విద్యార్థుల అరెస్టులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అభిల భారత విద్యార్థి పరిషత్(ఏబివిపి) ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. అది గమనించిన పోలీసులు విద్యార్థులను అడ్డుకోవాలని చూశారు. అయితే విద్యార్థులు మెరుపు వేగంతో అసెంబ్లీ గేటు ఆవరణలోకి దూసుకొచ్చారు. కొందరు అసెంబ్లీ గేటు ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అసెంబ్లీ ప్రాగణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నినాదాలతో హోరెత్తింది. అయితే ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలు బయటకు తీశారు. కొందరు విద్యార్థులు అక్కడే పడుకుని ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/