షీ టీమ్ ద్వారా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
మహిళా సాధికారత సదస్సు లో సిపి సజ్జనార్
హైదరాబాద్: మహిళల భద్రత పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్మంలో హెచ్ఐసిసిలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి సజ్జనార్, ఐజీ స్వాతి లక్రా, టెస్సీ థామస్, సినీ నటి సాయి పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళల భద్రతే తెలంగాణ పోలీసుల ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ కారిడార్లో 24 గంటలపాటు గస్తీ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. సంవత్సరం పొడవునా చిన్నారుల కోసం ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 200 మందికి పైగా వాలంటీర్లు ట్రాఫిక్ పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3.5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నట్లు సజ్జనార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆరు లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/