జూలైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు
ఇంటర్ బోర్డు వెల్లడి
Hyderabad: తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో మూడు గంటల పరీక్షా సమయాన్ని 90 నిమిషాలకు కుదించింది. ప్రశ్నాపత్రంలో 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందని వెల్లడించింది. దీన్నే 100 శాతానికి పరిగణిస్తామని ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు పంపిన లేఖలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.
కరోనా కారణంగా రెండు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఉపయోగించడం ద్వారా ఉదయం, మధ్యాహ్నం పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. జూలై మధ్య నుండి పరీక్షలను నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలను ప్రకటించవచ్చని తెలిపింది. కోవిడ్ లేదా ఇంకా ఏవైనా కారణాల వల్ల పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని వెల్లడించింది.
కాగా ఈ నెల 29 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ను వాయిదా వేస్తూ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ప్రకటించారు. జూన్ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/