బక్రీద్‌ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు

జంతువుల అక్రమ వధపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ

telangana high court
telangana high court

హైదరాబాద్‌: బక్రీద్ సందర్భంగా జంతువధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. బక్రీద్ నేపథ్యంలో ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ దాఖలైన పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారమే జంతువధ జరగాలని స్పష్టం చేసింది. అంతేకాదు, జంతుమాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు తినడం వల్లే కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించింది. దాంతో, మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్నారా అని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. ఈ వివరాలన్నింటితో రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/