తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

గణేష్ నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉంది..హైకోర్టు

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అంటూ జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక కూడా లేదా ? అని హైకోర్టు ప్రశ్నించింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీసింది.

జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని మండిపడింది. రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లోనూ వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కాలుష్య నివారణ కోసం లక్ష మట్టి గణపతులను ఉచితంగా ఇస్తున్నామని, మట్టి గణపతుల తయారికి కూడా ప్రోత్సహాకాలు ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.

.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/