టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాల‌యాల‌కు భూమి కేటాయింపుపై పిటిష‌న్‌

హైదరాబాద్: తెలంగాణ‌లో అధికార పార్టీకి హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్‌లో భూమి కేటాయించిన వ్య‌వ‌హారంపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాల‌కు భూమి కేటాయింపును స‌వాల్‌ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మ‌హేశ్వ‌ర‌రాజు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌లో హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాల‌యానికి భూమి కేటాయింపును కూడా పిటిష‌నర్ ప్ర‌స్తావించారు. అత్యంత ఖ‌రీదైన భూమిని గజం రూ.100 చొప్పున ఏకంగా 4,935 గ‌జాల‌ను టీఆర్ఎస్‌కు కేటాయించ‌డాన్ని పిటిష‌న‌ర్ ప్ర‌శ్నించారు. దీనిపై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు కేసీఆర్‌తో పాటు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌ల‌కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆ నోటీసుల్లో ఆదేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/