తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు అనుమతి

జూన్‌ 8 తర్వాత పరీక్షలు.. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి

telangana-high-court-hearing-on-tenth-exam

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పదో తరగతి‌ పరీక్షలను మళ్లీ నిర్వహించడానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షలను జూన్‌ 8 తర్వాత నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండాలని చెప్పింది. భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. అయితే, జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారుని హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలోనూ కేసుల తీవ్రత పెరుగుతున్నట్లయితే, అప్పటి పరిస్థితులను బట్టి మరో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కాగా, తెలంగాణలో లాక్‌డౌన్‌కి ముందు పదో తరగతి పరీక్షలు మూడు జరగగా, మరో ఎనిమిది మిగిలి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పరీక్షల కేంద్రాల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/