కరోనా బాధితుడ్ని పరామర్శించిన మంత్రి ఈటల

అవగాహన పెంచాల్సింది పోయి ఆందోళన చేస్తారా అంటూ జూ. డాక్టర్లకు చురకలు

Minister Etela Rajender visits Gandhi hospital hyderabad
Minister Etela Rajender visits Gandhi hospital hyderabad

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలోని కరోనా బాధితుడ్ని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ పరామర్శించారు. అతని చెంతకు వెళ్లి క్షేమ సమాచారాలు అడిగి తెలసుకున్నారు. అతిగా భయాందోళనలకు గురి కావద్దని, క్షేమంగా బయటకు తీసుకొచ్చే బాధ్యత తమదని మంత్రి కరోనా బాధితుడికి భరోసా ఇచ్చారు. కరోనా లక్షణాలతో గాంధీకీ వచ్చిన వారిని కూడా ఆయన పరామర్శించారు. గాంధీ ఆసుపత్రిలోని మొత్తం 7 ఫ్లోర్లలో ఈటల రాజేందర్ తిరిగారు. కేవలం వైరస్ కలిగిన రోగులతో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన మాస్క్ ధరించారు. ఇతర రోగులతో మాట్లాడేటప్పుడు మాస్క్ లేకుండా నేరుగా మాట్లాడారు. తద్వారా కరోనా గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వెంట డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ డాక్టర్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు.

మరోవైపు, కరోనా వార్డును నగర శివార్లకు తరలించాలంటూ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారితో ఈటల మాట్లాడుతూ చురకలు అంటించారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సి డాక్టర్లే ఆందోళన చెందితే ఎలాగని ఆయన ప్రశ్నించారు. మంత్రిగా తానే ఇక్కడకు వచ్చినప్పుడు డాక్టర్లయిన మీరు భయపడటంలో అర్థం లేదని అన్నారు. ఐసొలేషన్ వార్డు ఉండటం వల్ల వైరస్ ఎవరికీ సోకదని ధైర్యం చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/