తెలంగాణలో జులై 5 తర్వాత మోగనున్న బడిగంట!

దశల వారీగా తెరిచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

నేటి మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మంత్రి సబిత సమావేశం

school-students

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు జులై 5 తర్వాత తెరవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అది కూడా దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తొలుత 8 నుంచి 10 తరగతులు ప్రారంభించాలని, ఈ సందర్భంగా లోపాలు బయటపడితే వాటిని సరిచేసిన అనంతరం మిగతా తరగతులను కూడా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు, పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) వ్యూహాపత్రాన్ని రూపొందించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నిన్ననే దీనిపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) మార్గదర్శకాల తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అలాగే, స్కూళ్ల పునః ప్రారంభంపై మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/