సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్

ts-govt-approaches-to-supreme-court

న్యూఢిల్లీ: ఏపి ప్రభుత్వం తల పెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం కనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది.

నిజానికి నేడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా నిర్ణయించిన ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున సమావేశానికి హాజరు కాలేనని తెలిపారు. కాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం కనుక ముందుకు వెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టెండర్లు కూడా ఆహ్వానించడంతో నిన్న రాత్రి ఎలక్ట్రానిక్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/