తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ కలవరం పెట్టిస్తున్నాయి. ఇటీవల రోజుల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కొంతమేర కరోనాను కట్టడి చేస్తున్నామని అటు ప్రజలు, ప్రభుత్వాధికారలు అనుకుంటున్నారు. అయితే తాజాగా కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరగడంతో ఇప్పుడు మళ్లీ అందరూ ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో మొత్తం 1498 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గతకద్ది రోజులుగా వెయ్యిలోపు కేసులు నమోదవుతుండటంతో ప్రజలు కుదుటపడ్డారు. కానీ మళ్లీ ఒక్కసారిగా ఇలా 1500కు చేరువలో కరోనా కేసులు నమోదవడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వెవ్ విజృంభిస్తుండటమే కరోనా కేసుల పెరుగుదలకు కారణమని వైద్యులు అంటున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 3,14,735 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 3,03,013 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక 9993 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 6 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో కరోనా కారణంగా మొత్తం 1729 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వారు తెలిపారు.