డ్రగ్స్ అనే మాటే తెలంగాణ‌లో విన‌ప‌డొద్దు: సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈనెల 28న‌ ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరుపాలని సీఎం నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ జరుగనున్న ఈ సదస్సులో రాష్ట్ర హోం, ఎక్సైజ్ శాఖ మంత్రుల‌తోపాటు సీఎస్, డీజీపీ, డిజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈమేరకు పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యల పై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎంవో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని స్ప‌ష్టం చేశారు. కఠిన చర్యల అమలకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో కూడిన ప్రత్యేకంగా ‘‘ నార్కాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ’’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డిజిపి ఆధ్వర్యంలో, డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనున్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/