ట్రాఫిక్ హోంగార్డును సత్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర ఓ ట్రాఫిక్ హోంగార్డ్ను సత్కరించారు. చీఫ్ జస్టిస్ తన వాహనాన్ని ఆపి.. ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం అందించారు. అంతే కాదు అష్రఫ్ అలీ పనితీరును మెచ్చుకుంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశంసలు కురిపించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం హైదరాబాద్ లోని అబిడ్స్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఈరోజు ఆవిష్కృతమైంది.
చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రతి రోజు తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తుంటారు. ఆ సమయంలో అబిడ్స్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ అలీ (5066, అబిడ్స్ పీఎస్) విధులు నిర్వర్తిస్తుంటాడు. అష్రఫ్ తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్ జస్టిస్ ప్రతి రోజు గమనించేవారు. ఈ క్రమంలో అతని పనితీరు పట్ల ఆకర్షితులైన సీజే సతీశ్ చంద్ర శర్మ ఈరోజు తన కాన్వాయ్ను బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డ్ అష్రఫ్ అలీకి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/