కొత్త వేరియంట్..ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కేసీఆర్

ఒమిక్రాన్ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి, తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్మల్, కుమరం భీమ్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు.

కరోనా పరీక్షలను ఎక్కువగా చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మందులను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈరోజు మంత్రివర్గ భేటీ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, యాసంగి సాగు, ధాన్యం కొనగోళ్లపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పైమేరకు ఆదేశాలను జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/