వ‌డ‌దెబ్బ‌కి గురైన బండి సంజ‌య్..

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వడదెబ్బకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే కాలు బయటపెట్టాలంటే ప్రజలు వణికిపోతున్నారు. అయినప్పటికీ బండి సంజ‌య్ పాదయాత్ర చేస్తుండడం తో వడదెబ్బకు గురయ్యారు. బండి సంజ‌య్ వ్యక్తిగత వైద్యుడు ఆయనకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. తనకు ఏదోలా ఉందని సంజయ్ చెప్పారని, వెంటనే చికిత్స అందించామని, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని చెప్పారు. రెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించానని అన్నారు.

మరోవైపు డాక్టర్ సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే ప్రజల బతుకులు బాగుపడతాయనుకుంటే మరింత దిగజారాయన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించి, పేదల రాజ్యం తేవాలనే కసితో ఇన్ని కష్టాలకోర్చి పాదయాత్ర కొనసాగిస్తున్నామన్నారు.