ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడూ.. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సిఎం కెసిఆర్ భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సిఎం కెసిఆర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు ప్రత్యేక స్థానం ఉంది. క్రమశిక్షణ, కఠోర శ్రమ అంకితభావంతో అంచలంచలుగా ఎదిగారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థాయిలో నిలబెట్టారు. ప్రపంచంలోనే ప్రణబ్ ముఖర్జీ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. మహోన్నత రాజనీతిజ్ఞుడిగా మెలిగారు. రాజకీయాల్లో ఆయన పాత్ర చిరస్మరణీయమని అన్నారు.
కాగా, శాసనసభ ఆవరణలో రద్దీని తగ్గించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు అనుమతి నిరాకరించడంతో పాటు మీడియా, అధికారులకు జారీ చేసే పాస్ల సంఖ్యను భారీగా కుదించారు. సుమారు 20 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/