అచ్చెన్నాయుడు అరెస్టును ఖండించిన చంద్రబాబు

అమరావతి: ఏపి టిడిపి అధ్యక్షడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేయడాన్ని టిడిపి అధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని… అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. నిమ్మాడలో గత 40ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఉద్రిక్తతలు లేవన్నారు. ప్రశాంత గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించింది ఎవరు..? అని, దువ్వాడ శ్రీనివాస్ స్వగ్రామానికి అచ్చెన్నాయుడు వెళ్లాడా..? అని ప్రశ్నించారు.

అచ్చెన్న స్వగ్రామానికి దువ్వాడ వచ్చి ఘర్షణలు రెచ్చగొట్టారా..? అని నిలదిస్తూ, వాటికి సంబంధించి ఫోటోలు, వీడియోలే సాక్ష్యాధారాలని బాబు చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం గర్హనీయమని విమర్శించారు. ”ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా..? అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా..?” అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రపై పగబట్టి హింసా విధ్వంసాలు చేస్తున్నారన్నారు. రామతీర్ధం సంఘటనలో తనపై, కళా వెంకట్రావుపై, అచ్చెన్నాయుడిపై కూడా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. కూన రవికుమార్, వెలగపూడి రామకృష్ణబాబు సహా అనేక మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. సబ్బం హరి ఇంటిని, గీతం విశ్వవిద్యాలయం భవనాలను ధ్వంసం చేశారని తెలిపారు. గతంలో అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి 83రోజులు అక్రమ నిర్బంధం చేశారని… ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా 5 జిల్లాల్లో 20గంటలు 700కిలోమీటర్లు తిప్పించి మళ్లీ ఆపరేషన్లకు కారణం అయ్యారని చంద్రబాబు ఆగ్రహించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/