ఏపీ అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి : సుహాసిని

ఢిల్లీని గడగడలాడించిన ఘనత ఎన్టీఆర్ దని వ్యాఖ్య

ఒంగోలు: ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకురాలు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ఆమె మాట్లాడుతూ… తెలుగుదేశం శ్రేణులకు మహానాడు గొప్ప రోజని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన ఎన్టీఆర్ జన్మదినమని చెప్పారు. టీడీపీని స్థాపించి ఢిల్లీని గడగడలాడించిన ఘనత ఎన్టీఆర్ దని కొనియాడారు. తాతగారి పుట్టినరోజు తమకు ఎప్పుడూ పండుగరోజేనని.. ఆయన జన్మదినాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేసే వాళ్లమని అన్నారు.

విజయం అనేది తెలుగుదేశం పార్టీ చూడనిది కాదని… ఇప్పుడు మళ్లీ ఏపీ అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు సంక్షేమం కావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. గత టీడీపీ పాలన, ఇప్పటి వైస్సార్సీపీ పాలన మధ్య తేడా ఏమిటో ప్రజలంతా గుర్తించాలని కోరారు. అందరూ కలిసి టీడీపీని గెలిపించి, రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకురావాలని అన్నారు. నాన్న గారు ఎప్పుడూ తాతగారి వెంటే ఉండేవారిని… ఒక్కోసారి నాన్న గారిని కొన్ని నెలల పాటు తాము చూడలేకపోయేవాళ్లమని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/