స్పీకర్ పై పేపర్లు విసిరిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ యూనివర్శిటీగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అసెంబ్లీ లో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతూ.. స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేసారు. అక్కడితో ఆగకుండా స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై పేపర్లు విసిరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. సభా సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని టీడీపీ సభ్యులను స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు శాంతించలేదు.

దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లలేదు. ప్రాణాలు అర్పించైనా సరే… ఎన్టీఆర్ పేరును సాధిస్తామని నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.