ఏపీ శాసనసభ నుంచి 11మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

five-tdp-mlas-suspension-from-ap-assembly

అమరావతి: ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈ స‌మావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 11 ఎమ్మెల్యేలు పదేపదే సభను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని స‌స్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక ఐదుగురు ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండి తమ నిరసనను కొనసాగించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. మార్షల్స్‌తో సభ నుంచి వారిని బయటకు పంపించారు. అనంతరం మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేయసాగారు. అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల్లో నిమ్మకాయల చినరాజప్ప, వెలగపూడి రామకృష్ణబాబు, బెందాళం అశోక్‌, గొట్టిపాటి రవికుమార్‌, ఆదిరెడ్డి భవాని, గణబాబు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, ఎం.రామరాజు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లు ఉన్నారు.

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్ ప్రవేశపెట్టారు. ఈ కొత్త రూలింగ్ ప్రకారం.. సభలో ఎవరైనా సభ్యులు సభా కార్యాకలాపాలకు అడ్డుపడితే వారు సస్పెండ్ అవుతారు. మంగళవారం (మార్చి 15) ఏపీ అసెంబ్లీలో సభను హుందాగా నడిపేందుకు కొత్త రూల్ తీసుకొచ్చినట్టు గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంగా శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభా కార్యాకలాపాలకు అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/