నల్లారి కిషోర్కు ఫోన్ చేసిన లోకేశ్
ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్న లోకేశ్
అమరావతి: టిడిపి నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్సిపి శ్రేణులుదాడికి యత్నించిన సంగతి తెలిసిందే. మదనపల్లి సమీపంలో ఆయనపై దాడి జరిగింది. ఆ సమయంలో ఆయనతో పాటు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగడంతో వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఈ నేపథ్యంలో కిషోర్ కుమార్ రెడ్డికి టిడిపి నేత నారా లోకేశ్ ఫోన్ చేశారు. జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారా లోకేశ్ ఈ ఘటనపై స్పందిస్తూ, వైఎస్ఆర్సిపి దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజాసమస్యలపై టిడిపి చేస్తున్న పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. కిషోర్ పై దాడికి యత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని అన్నారు. అయితే ఈ ఘటనపై చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు, ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే కిషోర్ పై వైఎస్ఆర్సిపి దాడికి యత్నించిందని టిడిపి నేతలు మండిపడుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/