ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల గృహ నిర్బంధం

బంద్ నేపథ్యంలో అరెస్ట్ చేస్తున్న పోలీసులు

అమరావతి: టీడీపీ కార్యాలయంపై నిన్న జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.

మరోవైపు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. శ్రీకాకుళంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద ఆందోళనకు దిగిన నేతలను అరెస్ట్ చేశారు.

రాజాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును గృహ నిర్బంధం చేశారు. విశాఖపట్టణంలోనూ పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌తోపాటు 10 మంది నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. టీడీపీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ టీడీపీ నేతలు నిరసనలకు దిగారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును, పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులు, పెడనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

ఇక గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరవిందబాబును అరెస్ట్ చేసి శావల్యాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఆందోళనతో పలుచోట్ల జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి.

రాయలసీమలోనూ టీడీపీ నేతల అరెస్ట్, గృహనిర్బంధాలు కొనసాగాయి. మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలులో టీడీపీ నేత సోమిరెడ్డి వెంకటేశ్వర్లు, డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేఈ ప్రభాకర్, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మల్సీ ఫరూక్, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/