పలువురు టిడిపి నేతల గృహ నిర్బంధం

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు నేతలు, కార్యకర్తలు అరెస్ట్

tdp-leader
tdp-leader

అమరావతి: రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రెండు వారాలుగా ఆందోళన చేస్తున్న రైతులు నేడు జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి టిడిపి మద్దతు ప్రకటించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టిడిపి నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు టిడిపి నేతలను అదుపులోకి తీసుకున్నారు. వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌‌తోపాటు విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు, కార్యకర్తలను కూడా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మంగళగిరిలో టిడిపి నేత గంజి చిరంజీవి, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు కొమ్మారెడ్డి నాని, పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, తాడేపల్లి పట్టణ, రూరల్ టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్లకుండా చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/