లోకేశ్ కుడి భుజానికి గాయం..వైద్యుల సూచనతో ఎంఆర్‌ఐ స్కానింగ్‌

tdp-leader-nara-lokesh-went-mri-scanning-for-right-shoulder

అమరావతిః దాదాపు 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న టిడిపి యువనేత నారా లోకేశ్ ఈ ఉదయం నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో స్కానింగ్ చేయించుకున్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, వారికి మధ్య తోపులాట జరిగింది. దీంతో లోకేశ్ కుడి భుజానికి గాయమైంది. అయినప్పటికీ దానిని లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు.

నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియోథెరపీ చేయించుకున్నా, వైద్యుల సూచనలు పాటించినా నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటినా నొప్పి వేధిస్తుండడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాల పద్మావతినగర్‌లోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్‌కు వెళ్లిన లోకేశ్ అక్కడ స్కానింగ్ చేయించుకున్నారు. కాగా, లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో 103వ రోజుకు చేరుకుంది. ఆయనను చూసేందుకు జనం పోటెత్తడంతో నంద్యాల రోడ్లు కిక్కిరిసిపోయాయి.