చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు

శవ రాజకీయాల గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉంది.. దివ్యవాణి

tdp-leader-divyavani

అమరావతి: ఎమ్మెల్యే రోజా తిరుమలలో టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టిడిపి మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు. శవరాజకీయాల గురించి, సంప్రదాయాల గురించి రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో టిడిపిలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌సిపిని పంచలూడదీసి కొడతానని వ్యాఖ్యానించిందీ, కెసిఆర్‌ ను తాగుబోతు అన్నదీ ఈ రోజాయేనని, ఇప్పుడు పార్టీలో తన పరపతి పెంచుకోవడం కోసం, పదవుల కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అనే రీతిలో రోజా దిగజారిపోయిందని దివ్యవాణి విమర్శించారు.

అసలు చంద్రబాబు గురించి మాట్లాడ్డానికి ఒక స్థాయి ఉండాలని, రోజాకు అది లేదని స్పష్టం చేశారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబును చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్లు, నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. ‘నీ వెకిలివేషాలు ప్రదర్శించడానికి ఇదేమీ జబర్దస్త్ షో కాదు… శవరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైఎస్‌ఆర్‌సిపినే. అలాంటి పార్టీలో ఉన్న నువ్వు శవరాజకీయాల గురించి మాట్లాడుతున్నావా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నంద్యాలలో భూమా అఖిలప్రియ వేసుకున్న దుస్తులను విమర్శించినప్పుడు ప్రజలు చీపుర్లతో కొట్టి, నీ మొహాన పేడనీళ్లు కొట్టారన్న విషయం మర్చిపోయి, ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/