తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారుః అనిత

జగన్ కు పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉన్నది అని ప్రశ్న

AP Telugu Mahila president Vangalapudi Anitha
Vangalapudi Anitha

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు టిడిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలను భార్గవ్ రెడ్డి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

చంద్రబాబును గద్దె దింపాలని, జగన్ ను సీఎం చేయాలని తాను అనలేదని… ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈ మార్ఫింగ్ వీడియోను సాక్షి ఛానల్ లో కూడా ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్గవ్ రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

వైఎస్‌ఆర్‌సిపి నేతలు విపక్ష నేతలను ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని అనిత విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమపై వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉన్నది? అని ఆమె ప్రశ్నించారు.