మునుగోడు ఉప ఎన్నిక నుండి తప్పుకున్న టీడీపీ
మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీడీపీ కూడా నిలబడుతుందని ఆ పార్టీ తెలంగాణ నేతలు చెప్పుకొచ్చారు. కానీ గురువారం ఈ ఉప ఎన్నిక నుండి తప్పుకుంటున్నట్లు టీ టీడీపీ ప్రకటించింది. ఈ మేరకు టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అధికారిక ప్రకటన చేసారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో శుక్రవారంతో నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ క్రమంలో మునుగోడులో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ నేత జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రకటిస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రకటనకు విరుద్ధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదన్న బక్కని నర్సింహులు ప్రకటన వచ్చింది. పార్టీకి చెందిన కీలక నేతలు, మునుగోడుకు చెందిన క్షేత్ర స్థాయి నేతలతో చర్చించిన మీదటే పోటీకి దూరంగా ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నామని బక్కని తెలిపారు.