పాడి రైతులకు బోనస్‌ ఎగ్గొటారు

మా పార్టీ హయాంలో తెచ్చిన చట్టాలను పక్కనబెట్టారు

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao

అమరావతి: ఏపి ప్రభుత్వం పాడి రైతులకు అన్యాయం చేస్తోందంటూ టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ‘పాడి రైతులకు ఇస్తామన్న బోనస్ ఎగ్గొట్టారు, పాడిరైతుల ప్రయోజనాలను కాపాడటానికి టిడిపి హయాంలో తెచ్చిన చట్టాలను పక్కనబెట్టారు. వేలకోట్ల రూపాయల విలువ చేసే పాడి రైతుల, సహకార సంఘాల ఆస్తులని బయటి రాష్ట్ర  “అమూల్” సంస్థకు బలవంతంగా కట్టబెట్టారు. దీని వెనుక ఉన్న మీ దోపిడీ, చీకటి ఒప్పందాలను బయటపెట్టండి వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు.

కాగా, ఏపిలో పాల సేకరణలోనూ ప్రభుత్వ జోక్యానికి రంగం సిద్ధమైందని, ఏపిలో ఉత్పత్తయ్యే పాలలో అధికశాతం ‘అమూల్‌’కు ధారాదత్తం చేయడానికి ఏపి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపిలో 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయని, రాష్ట్రంలో ఇన్ని ఉంటే వాటిని వదిలేసి గుజరాత్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అందులో పేర్కొన్నారు. విజయ బ్రాండ్‌ పేరుతో వీటిలో సేకరించిన పాలను అమూల్‌కు ధారపోసేందుకు వైఎస్‌ఆర్‌సిపి సర్కారు సిద్ధమవుతోందని, దీంతో సహకార రంగంలో నడుస్తున్న డెయిరీలు నిర్వీర్యం కావడంతో పాటు ప్రైవేటు డెయిరీల మనుగడకూ ప్రమాదం వాటిల్లుతుందని అందులో రాసుకొచ్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/