15 రోజుల్లో మొత్తం పింఛన్లు చెల్లించాలి
రాజకీయ కారణాలతో పింఛన్లను ఎలా ఆపుతారు
అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరావు ఏపిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జాప్యం జరుగుతోందంటూ విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో పలువురికి అకారణంగా పింఛన్లు నిలిపేయడంలోని ప్రభుత్వ వైఖరిని ఏపి హైకోర్టు తీవ్రంగాతప్పుబట్టిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం పట్ల ఉన్న శ్రద్ధ వితంతువుల పింఛన్లపై లేకపోయిందని కోర్టు దుయ్యబట్టిందని అందులో ఉంది. ధ్రువీకరణ పత్రాలు లేవన్న సాకుతో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు నిలిపేయడాన్ని ఆక్షేపించిందని అందులో పేర్కొన్నారు. వీటిని ప్రస్తావిస్తూ దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ‘కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ పేదవారిపై ఏది? రాజకీయకారణాలతో పింఛన్లను ఎలా ఆపుతారు? ప్రజాధనం పౌరుల ఆస్తి, సర్కారు ధర్మకర్త మాత్రమే ఆత్మ విమర్శ చేసుకోండి, వచ్చే 15 రోజుల్లో మొత్తం పింఛన్లు చెల్లించాలి అంటున్న మాటలు వినబడుతున్నాయా? వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/