పట్టాభిని అరెస్టు చేశారా..? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా?: చంద్రబాబు

గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరంలో పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తాజాగా డీజీపీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన బాబు.. వైఎస్‌ఆర్‌సిపి తీరుపై మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు దాడులకు దిగుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని ఆరోపించారు. పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారా..? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టిడిపి నేతలు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేసినట్టు టిడిపి అధినేత పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. పోలీసులు గన్నవరంలో సెక్షన్ 144 విధించారు. పోలీస్‌ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీ అనుచరులే టిడిపి కార్యాలయంపై దాడి చేసినట్టు టిడిపి శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.