అధికారంలోకి వస్తే పెట్రోలు రేట్లు తగ్గిస్తామని జగన్: చంద్రబాబు
ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు..చంద్రబాబు పిలుపు
Chandra babu
అమరావతి : ఏపీలో పెట్రోలు ధరలు కనీసం రూ.16 తగ్గించి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపడతామని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పెట్రోలు ధరలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఈ రోజు చంద్రబాబు మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ…. అధికారంలోకి వస్తే పెట్రోలు రేట్లు తగ్గిస్తామని జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించిన తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రోలు ధరలు తగ్గించాయని, ఏపీలో మాత్రం తగ్గించలేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెట్రోలు ధరలపై జగన్ ఆందోళన చేశారని చంద్రబాబు అన్నారు. అధికారం చేతిలో ఉందని జగన్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/