కొల్లు రవీంద్ర అరెస్టును ఖండిస్తున్నాం.. అచ్చెన్నాయుడు

అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

శ్రీకాకుళం: టీడీపీ ఏపీ అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై మండిప‌డ్డారు. శ్రీకాకుళంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… త‌మ పార్టీ నేత కొల్లు రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు నిదర్శనమని ఆయ‌న ఆరోపించారు. ఆయ‌న‌ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. కొల్లు రవీంద్ర‌ను వెంటనే విడుదల చేయాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. పండుగ‌ రోజున కూడా టీడీపీ నేతలను అరెస్టులతో వెంటాడుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మాత్రం తన కుటుంబంతో హాయిగా పండుగ జరుపుకుంటున్నార‌ని చెప్పారు.

జగన్ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయ‌న తెలిపారు. జ‌గ‌న్ ప్రజాస్వామ్యాన్ని కూడా లెక్కచేయట్లేద‌ని ఆయ‌న మండ‌పడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే బీసీలపై జ‌గ‌న్ కన్నెర్ర చేశారని, వైస్సార్సీపీ అక్రమాలను అడ్డుకున్నందుకే కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైస్సార్సీపీ నేత‌లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాల‌న్నారు. వైస్సార్సీపీ నేతలకు చ‌ట్టాలు చుట్టాలు అయ్యాయా? అంటూ నిల‌దీశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను కొన‌సాగిస్తూ బడుగు, బలహీన వర్గాలను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/