ఆక్వాకు మద్ధతు ధర కుదించడం జగన్ అసమర్థతేః అచ్చెన్నాయుడు

తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్

atchannaidu

అమరావతిః ఏపి ప్రభుత్వంపై మరోసారి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టడమేంటని ఆయన విమర్శించారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన టిడిపి లీడర్లపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, వెంకట శివరామరాజు, పత్తిపాటి పుల్లారావుతో పాటు మరో 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ మొదట నిర్ణయించిన మొత్తం రూ.240 లను రూ.210 లకు తగ్గించడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్ధతకు నిదర్శనమని అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. దీనిపై శాంతియుతంగా పోరాడుతున్న టిడిపి నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వం అనుసరిస్తున్నఅప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగం దేశంలోనే అగ్రభాగాన ఉందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రస్తుతం ఆక్వా రంగం పతనావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలను భరించలేక, మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జే ట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నించిన వారిని అణచివేయాలనే జగన్ రెడ్డి కుట్రలు సాగబోవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/