వైస్సార్సీపీ 175 స్థానాల్లో గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తాం: అచ్చెన్నాయుడు
175 స్థానాల్లో గెలుస్తామని జగన్ కు నమ్మకం ఉందా?
అమరావతి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికార వైస్సార్సీపీ కి ఓ సవాల్ విసిరారు. సీఎం జగన్ చెబుతున్నట్లుగా 175 స్థానాల్లో వైస్సార్సీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలు వేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మరి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్కు నమ్మకం ఉందా? అని అచ్చెన్న ప్రశ్నించారు. అదే నమ్మకం ఉన్నట్లైతే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. తక్షణమే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయినా ఏం చేశారని రాష్ట్ర ప్రజలు వైస్సార్సీపీని 175 స్థానాల్లో గెలిపిస్తారని అచ్చెన్న ప్రశ్నించారు. మరోమారు జగన్కు ఓట్లేసేంత అమాయకులు ప్రజలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. టెన్త్ రిజల్ట్స్ నేపథ్యంలో ప్రభుత్వ తప్పుల కారణంగా మనోవేదనకు గురవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భరోసా నింపేందుకు నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే వైస్సార్సీపీ నేతలు అందులోకి దొంగల్లా ప్రవేశించారని అచ్చెన్న మండిపడ్డారు. పిల్లలను భయపెట్టి జూమ్ కాన్ఫరెన్స్లోకి చొరబడ్డ వైస్సార్సీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/