టాటా మోటార్స్‌ కార్ల ధరలకు రెక్కలు

కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి టాటా మోటార్స్‌ షాక్ ఇచ్చింది. కార్ల ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించింది. ఉత్పత్తి వ్యయం పెరిగిపోవ‌డం వల్ల పెంచ‌క త‌ప్ప‌డం లేదని తెలిపింది. దీంతో అన్ని పాసింజర్‌ వాహనాలపై 0.55 శాతం చొప్పున ధరలు పెరగనున్నాయి. వేరియంట్‌, మోడల్‌ బట్టి ధరల పెంపుదలలో తేడా ఉంటుందని కంపెనీ తెలిపింది.

వినియోగ‌దారుల‌పై ఇన్‌పుట్ కాస్ట్ వ్య‌యం స్వ‌ల్పంగా మాత్ర‌మే పెంచుతున్నామ‌ని చెప్పుకొచ్చింది. టాటా నెక్సాన్‌, టాటా పంచ్‌, టాటా హారియ‌ర్‌, టాటా స‌ఫారీతోపాటు వివిధ ర‌కాల కార్ల‌ను టాటా మోటార్స్ విక్ర‌యిస్తున్న‌ది. ఈ నెల‌లోనే టాటా మోటార్స్.. వాణిజ్య వాహనాల ధ‌ర‌ల‌ను 1.5-2.5 శాతం పెంచుతున్న‌ట్లు టాటా మోటార్స్ ప్ర‌క‌టించింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి టాటా మోటార్స్ త‌న కార్లు, వాణిజ్య వాహ‌నాల ధ‌ర‌లు పెంచుతూనే వ‌చ్చింది. గ‌త జ‌న‌వ‌రి 19న తొలిసారి అన్నిర‌కాల ప్యాసింజ‌ర్ కార్ల ధ‌ర‌లు ఒక‌శాతం పెంచేసింది. గ‌త మార్చిలో ప్ర‌యాణ కార్ల‌పై 2-2.5 శాతం ధ‌ర‌లు పెంచింది. అంత‌కుముందు 2021 డిసెంబ‌ర్ ఆరో తేదీన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌పై 1.5-2 శాతం ధ‌ర‌లు పెంచడం జరిగింది.