నేడు వరంగల్‌లో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్‌ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై మరికాసేపట్లో వరంగల్ లో పర్యటించనున్నారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీకి కాసేపట్లో చేరుకోనున్నారు. యూనివర్శిటీలో జరిగే 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు. 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన 56 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేయనున్నారు. మరో 276 మందికి గోల్డ్ మెడల్స్ అందించనున్నారు.

గవర్నర్ తమిళిసై రోడ్డు మార్గంలోనే వరంగల్ కు బయల్దేరారు. కార్యక్రమం అనంతరం కూడా రోడ్డు మార్గంలోనే ఆమె హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పర్యటనకు పోలీసులు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ యూనివర్శిటీలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌ లోనే తమిళసై మధ్యాహ్న భోజనం చేస్తారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్ కు వెళ్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, బీజేపీ-టిఆర్ఎస్ వార్ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఉత్కంఠత రేపుతోంది.