గవర్నర్ ఆఫీస్ పై తీవ్రమైన వివక్ష చూపుతున్నారంటూ తమిళసై ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం ఫై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా.. గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని తెలిపారు. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజభవన్ లో గవర్నర్ మాట్లాడుతూ.. తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, తనకి గౌరవం ఇవ్వకపోతే.. తానేమీ తక్కువ కాదని అన్నారు. గవర్నర్ గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పని నేను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

మేడారం జాతరకు వెళ్తానంటే హెలికాప్టర్ ఏర్పాటు చేయలేదు. ఈ మూడేళ్లలో రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా తీర్చిదిద్ది ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించా.. ఎన్నో యూనివర్శిటీలు, విద్యా సంస్థల్లో పర్యటించి సమస్యలు తెలుుసుకున్నా. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెతలు చూసి చలించిపోయా. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నర్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీస స్పందన లేదన్నారు.

సదరన్ కౌన్సిల్ భేటీలో విభజన సమస్యలు ప్రస్తావించే వీలున్నా ఎందుకు పట్టించుకోలేదు. అసలు ఆ సమావేశానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. నిద్రపోయేవాళ్లని లేపొచ్చు. నిద్రపోతున్నట్లు నటించేవాళ్లని లేపలేం. గవర్నర్‌గా నా పరిధి మేరకు పనిచేస్తున్నా. ఏనాడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు. గవర్నర్ కార్యాలయంపై తీవ్ర వివక్ష చూపుతున్నారు. ఎట్ హోం వస్తున్నానని సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి సడెన్‌గా రద్దు చేసుకోవడం మంచి పద్దతేనా?. నేను ప్రజలను కలవాలనుకున్న ప్రతిసారి ఏదొక అడ్డంకి ఎదురవుతోంది అన్నారు.

రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచి పెట్టామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ఏర్పాటు చేసి మహిళల సమస్యలను తెలుసుకున్నాం అని చెప్పిన ఆమె, వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మహిళను అవమానించారన్నది తెలంగాణ చరిత్రలో ఉండకూడదని తన అభిప్రాయమని తెలిపారు.