ఇన్‌స్పెక్ట‌ర్ రాజేశ్వ‌రీని సన్మానించిన సీఎం స్టాలిన్

చెన్నై : చెన్నైలోని టీపీ చ‌ట్రం ఏరియాలోని ఓ శ్మ‌శాన వాటిక‌లో స్పృహ త‌ప్పి ప‌డిపోయిన ఉద‌య్ కుమార్ అనే యువ‌కుడిని ప్రాణాల‌తో కాపాడిన ఇన్‌స్పెక్ట‌ర్ రాజేశ్వ‌రీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. శుక్ర‌వారం ఉద‌యం రాజేశ్వ‌రీని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ అభినందించి, సన్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆమెపై సీఎం ప్ర‌శంస‌లు కురిపించారు.

తమి‌ళ‌నా‌డుకు చెందిన ఉద‌య‌కు‌మార్‌(28) ఓ శ్మశా‌నంలో పని‌చే‌స్తు‌న్నాడు. అక్కడే ఉండే‌వాడు. కొన్ని రోజు‌లుగా కురు‌స్తున్న వర్షా‌లతో, చలి వాతా‌వ‌ర‌ణంతో అతని ఆరోగ్యం బాగా దెబ్బ‌తి‌న్నది. అప‌స్మా‌రక స్థితి‌లోకి వెళ్లి‌పో‌యాడు. అతడు చని‌పో‌యా‌డ‌ను‌కొని స్థాని‌కులు పోలీ‌సు‌లకు సమా‌చారం ఇచ్చారు. ఇన్‌‌స్పె‌క్టర్‌ రాజే‌శ్వరి అక్క‌డికి చేరు‌కొ‌న్నారు. బతికే ఉన్నట్టు గుర్తించి వెంటనే ఉద‌య‌కు‌మా‌ర్‌ను తన భుజా‌లపై ఎత్తు‌కొని వాహనం దగ్గ‌రకు మోసు‌కొచ్చి దవా‌ఖా‌నకు తర‌లిం‌చారు. ఈ వీడియో వైరల్‌ అయింది. యువ‌కుడి ప్రాణాల‌ను కాపాడిన సీఐ రాజేశ్వ‌రిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/