సీఎంగా స్టాలిన్‌.. ప్రధానిగా రాహుల్ గాంధీ..తమిళ ప్రజలు: సి ఓటర్ సర్వే

స్టాలిన్‌కు ఓటేసిన 85 శాతం మంది
ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఓకే అన్న 54 శాతం మంది తమిళులు
మోడీ కి అనుకూలంగా 32 శాతం మంది ఓటు

చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. 2021లో ఎన్నికలు జరిగిన అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్)-సి ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తున్న స్టాలిన్‌కు అత్యంత ప్రజాదరణ ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. మిగిలిన ముఖ్యమంత్రులందరి కంటే అత్యధికంగా 85 శాతం ఆదరణ స్టాలిన్‌కు ఉన్నట్టు తేలింది.

అలాగే, దేశానికి కాబోయే ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు రాహుల్ గాంధీవైపే తమిళులు మొగ్గుచూపారు. ఆయనకు అనుకూలంగా 54 శాతం మంది మద్దతు తెలిపారు. ప్రస్తుత ప్రధాని మోడీకి 32 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. మోదీ పనితీరు బాగుందని 17 శాతం మంది అంటే, పరవాలేదని 40 శాతం మంది, బాగాలేదని మరో 40 శాతం మంది చెప్పుకొచ్చారు. ఇక, తమ జీవన ప్రమాణాలు వచ్చే ఏడాది పెరుగుతాయని 45 శాతం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులే వచ్చే ఏడాది కొనసాగుతాయని 12 శాతం మంది చెబితే, మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని 13 శాతం మంది అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/