ఆఫ్గనిస్థాన్ లో పబ్ జీ, టిక్ టాక్ పై నిషేధం!
దేశ యువతను తప్పుదోవ పట్టిస్తున్నందుకే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి

కాబూల్ః అఫ్ఘనిస్థాన్ లో కూడా పబ్ జీ, టిక్ టాక్ పై బ్యాన్ విధించాలని తాలిబన్లు నిర్ణయించారు. మూడు నెలల్లో ఈ రెండు యాప్ లను తమ దేశంలో ఎవ్వరూ ఉపయోగించకుండా చేయనున్నారు. వీటి వల్ల తమ దేశ యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. భద్రత, షరియా చట్ట అమలు సంస్థ సభ్యులతో దేశ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత 90 రోజులలో పబ్ జీ, టిక్టాక్ ను ఆఫ్ఘన్ లో నిషేధిస్తున్నట్టు ప్రకటన వెలువడింది.
పబ్ జీ నిషేధం అమలులోకి రావడానికి మూడు నెలల వరకు పట్టినా.. ఒక నెలలో టిక్టాక్ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తాలిబాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిషేధం గురించి దేశ ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేసింది. కాగా, ఈ రెండు యాప్ లపై బ్యాన్ ప్రకటనకు ముందే తాలిబాన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తమ దేశ పౌరులకు 23 మిలియన్లకు పైగా వెబ్ సైట్ ల యాక్సెస్ను బ్లాక్ చేసింది. ఈ వెబ్ సైట్లు అనైతిక విషయాలుగా భావించే వాటిని చూపిస్తున్నాయని ఈ చర్చ తీసుకుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/