భార‌త ప్ర‌భుత్వానికి లేఖ‌ రాసిన తాలిబ‌న్లు

న్యూఢిల్లీ: తాలిబ‌న్లు భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాశారు. రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆ లేఖ‌లో తాలిబ‌న్లు కోరారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘ‌నిస్థాన్ పేరుతో ఈ లేఖ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ అరుణ్ కుమార్‌కు తాలిబ‌న్లు ఈ లేఖ‌ను పంపించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హ‌మీదుల్లా అకున్‌జ‌దా ఈ లేఖ‌ను రాశారు.

సెప్టెంబ‌ర్ 7వ తేదీన ఈ లేఖ రాసిన‌ట్లుగా ఉంది. మీకు తెలిసే ఉంటుంది ఈ మ‌ధ్య అమెరికా బ‌ల‌గాలు తిరిగి వెళ్లిపోయే స‌మ‌యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను దెబ్బ‌తీశారు. అయితే ఖ‌తార్ సాంకేతిక సాయంతో ఎయిర్‌పోర్ట్‌ను పున‌రుద్ధ‌రించాము. ఈ మేర‌కు ఎయిర్‌మెన్‌కు నోటీసును ఈ నెల 6న జారీ చేశాము అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా రాశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇండియా, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. రెండు దేశాల మ‌ధ్య ప్ర‌యాణం సాఫీగా సాగాల‌న్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాము. మా అధికారిక ఎయిర్‌లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘ‌న్ ఎయిర్‌లైన్‌, కామ్ ఎయిర్ త‌మ విమానాల‌ను తిరిగి ప్రారంభించాల‌ని అనుకుంటున్నాయి. వారి వాణిజ్య విమానాలు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నాము అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా కోరారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/