ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపిన మంత్రి తలసాని

నిన్న కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు తలసాని కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. మంత్రి తలసాని తో పాటు టిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకున్నారు.

లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్న బీజేవైఎం నేతలు కవిత ఇంటిదగ్గర ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కవిత ఇంటిదగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు.

ఇక లిక్కర్ స్కామ్ ఫై నిన్న కవిత క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్‌ భయపడుతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్‌ భయపడరన్నారు. ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.

కేసీఆర్‌ కుమార్తెను కాబట్టే నా పైనా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్‌ ఉద్యమాన్నినడిపించారన్నారు. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు.