మీ ఇళ్లపైకి రావడం పెద్ద విషయం కాదు..తలసానిహెచ్చరిక

ఒక ఎంపీ చేసిన తప్పుడు ఆరోపణలను పట్టుకుని ఇంటిపైకి రావడం ఎంత వరకు సమంజసం..

talasani-condemns-bjp-attack-on-kavitha-residence

హైదరాబాద్‌ః ఢీల్లీ లిక్కర్‌ స్కామ్‌ విషయంపై హైదరాబాద్ లోని కవిత నివాసం వద్ద నిన్న బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో వారిపై టిఆర్ఎస్ శ్రేణులు ఎదురు దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు బిజెపి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

మరోవైపు ఈరోజు కవితను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ లతో కలిసి కవిత నివాసానికి ఆయన వెళ్లారు. అనంతరం మీడియాతో తలసాని మాట్లాడుతూ… కవిత ఇంటిపై బిజెపి శ్రేణులు దాడికి దిగడం దారుణమని అన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో కవిత ఇంటిపైకి బిజెపి నేతలు రావడం దుర్మార్గమని అన్నారు. బిజెపిది ఒక హేయమైన చర్య అని మండిపడ్డారు.

కవిత ఇంటిపై దాడికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, బిజెపి నేతలు రావడం సిగ్గు చేటని తలసాని అన్నారు. మీ ఇళ్ల పైకి మేము రావడం పెద్ద విషయం కాదని… తమ టిఆర్ఎస్ సైన్యం ఎంతో తెలుసా? అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి పరిణామాలు పునరావృతం అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఒక ఎంపీ మాట్లాడిన అవాస్తవాలు, చేసిన తప్పుడు ఆరోపణలను పట్టుకుని బాధ్యత గల ఒక వ్యక్తి ఇంటిపైకి రావడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/