అయ్యప్ప స్వామిపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్వరూపానందేంద్ర ఆగ్రహం

కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిపై ఇటీవల బైరి నరేశ్ అనే నాస్తికుడు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బైరి నరేశ్ ఫై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులతో పాటు సామాన్య భక్తులు సైతం పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు , ధర్నాలు , నిరసనలు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో బైరి నరేశ్ ఉన్నాడు.

ఈ వ్యవహారంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో అత్యంత శక్తిమంతమైన దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ప్రధానమైనదని, హిందూజాతిని మేల్కొలిపే ప్రముఖ ఆలయాల్లో ఒకటని అన్నారు. అలాంటి అయ్యప్ప స్వామిపై విదేశీ మతాలకు అమ్ముడుపోయే వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దారుణమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ… సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. హిందూ దేవుళ్లపై దూషణలు జరుగుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదని స్వరూపానంద అన్నారు. ఈ దూషణలను అంత ఈజీగా తీసుకోద్దని, ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కళ్లు తెరవాలని ఆయన అన్నారు. ఇంకెవరూ ఇలాంటి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.