కొత్త వ్యవసాయ చట్టాలపై ‘సుప్రీం’ స్టే
చట్టాల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వుల జారీ
New Delhi: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాల అమలును నిలిపి వేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం జరిగిన సదీర్ఘ వాదోపవాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.
అయితే, రైతు చట్టాలపై సమగ్ర చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది.
సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. తమకున్న హక్కులకు అనుగుణంగా రైతు సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది.
చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పేర్కొన్నారు.
వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/