పద్మనాభస్వామి ఆలయపాలనపై రాజకుటుంబానికి హక్కు ఉంది

తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

Supreme Court verdict on Kerala’s Padmanabha Swamy temple today


న్యూఢిల్లీ: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం కేసులో ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేప‌ట్టింది. చ‌రిత్రాత్మ‌క‌మైన ఆల‌యం ఆస్తుల్లో.. ట్రావెన్‌కోర్ రాచ కుటుంబానికి హిందూధ‌ర్మ చ‌ట్టం ప్ర‌కారం హ‌క్కు ఉన్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. ఒక‌రి మ‌ర‌ణం వ‌ల్ల దైవారాధ‌న‌కు చెందిన హ‌క్కులు ఆ కుటుంబంపై ప్ర‌భావం చూప‌వ‌ని, ఇది ఆచారం ప్ర‌కారం కొన‌సాగుతుంద‌ని సుప్రీం పేర్కొన్న‌ది. దేవుడి ఆస్తుల‌పై రాజ కుటుంబానికి ఆచారం ప్రకార‌మే హ‌క్కు ఉన్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. ఆల‌య నిర్వ‌హ‌ణ‌పైన కూడా సుప్రీం తీర్పునిచ్చింది. తిరువ‌నంత‌పురం జిల్లా జ‌డ్జి నేతృత్వంలో తాత్కాలిక క‌మిటీని ఏర్పాటు చేసి.. కొత్త క‌మిటీ ఏర్పాటు చేసే వ‌ర‌కు ఆల‌య నిర్వ‌హ‌ణను ఆ క‌మిటీకి అప్ప‌గించాల‌ని కోర్టు ఆదేశించింది. జస్టిస్‌ ఉదయ్‌ యూ లలిత్‌, ఇందూ మల్హోత్రలకు చెందిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.


కాగా ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్న రెండవ నేలమాలిగలో మరింత విలువైన సంపద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప‌ద్మ‌నాభ‌స్వామి కేసు ఆసక్తికరంగా మారింది. ఆలయ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్పందించ‌లేదు. ఇవాళ్టి తీర్పులో ఆ అంశాన్ని కోర్టు స్పృశించ‌లేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/