వలస కార్మికులు..కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదు

migrant workers-Supreme court

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈనేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని, రాష్ట్రాలు భరించాలని ఆదేశించింది. అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా రోడ్ల వెంబడి నడుస్తోన్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని సుప్రీంకోర్టు తెలిపింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని తెలిపింది. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపింది.
మరోవైపు ఇప్పటివరకూ కోటి మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వలస కార్మికులను ఆలస్యంగా తరలించాల్సి రావడానికి గల కారణాలపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా వ్యాప్తి చెందకుండా చూడటంతో పాటు ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు కార్మికుల తరలింపులో ఆలస్యమైందని కేంద్రం తెలిపింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/